PM-SETU పథకంలో తొలి అడుగు వేసిన ఆంధ్రప్రదేశ్.. విశాఖ ఐటీఐలకు అంతర్జాతీయ ప్రమాణాల ఆధునీకరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్యాభివృద్ధి రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. దేశంలోనే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PM-SETU (Prime Minister’s Scheme for Excellence in Training and Upskilling) పథకాన్ని అమలు చేయనున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. ఈ మేరకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ స్టీరింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్కు సంబంధించిన “స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్”కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదంతో విశాఖపట్నంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటీఐలు) ఆధునిక సాంకేతిక వసతులతో రూపాంతరం చెందనున్నాయి. ప్రముఖ ఉక్కు పరిశ్రమ సంస్థ ఆర్సెలార్ మిట్టల్ భాగస్వామ్యంతో ఈ ఆధునీకరణ కార్యక్రమాలు చేపట్టబడనున్నాయి.
జాతీయ స్థాయిలో సుమారు రూ.60,000 కోట్ల భారీ బడ్జెట్తో అమలు చేయనున్న ఈ కార్యక్రమంలో మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్కు అవకాశం లభించడం విశేషంగా మారింది. విద్యా మరియు సాంకేతిక భాగస్వామిగా NAMTECH సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కానుంది. దీని ద్వారా విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆధునిక నైపుణ్య శిక్షణ అందించనున్నారు.
ఈ ప్రాజెక్టులో “హబ్ అండ్ స్పోక్” మోడల్ను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రధాన శిక్షణా కేంద్రంగా విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ పనిచేస్తుండగా, అనుబంధ ఐటీఐలకు కూడా అదే ప్రమాణాలతో శిక్షణ మరియు సాంకేతిక సహకారం అందించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన కోర్సులు, ఆధునిక యంత్రాలు, డిజిటల్ ల్యాబ్లు మరియు పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం ఈ పథకంలో భాగంగా ఉండనున్నాయి.
కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు నేరుగా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే PM-SETU ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా యువత ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది.
“వికసిత్ భారత్ 2047” లక్ష్య సాధనలో భాగంగా ప్రభుత్వ ఐటీఐలను ప్రపంచ స్థాయి నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ విజయాన్ని ఆదర్శంగా తీసుకుని మరో 12 రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. పరిశ్రమల భాగస్వామ్యానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
